చిత్రమాలిక

2, అక్టోబర్ 2012, మంగళవారం

ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయింది - రెండవభాగం

మొదటి భాగం ఇక్కడ చదవండి

భానుమతిగారి గురించి డి.వి.నరసరాజు గారు ఈనాడు ఆదివారంకోసం వ్రాసిన కవర్‌స్టోరీ ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయింది నుంచి రెండవభాగం.

మరో బలహీనత ఒంటరిగా ప్రయాణం చేయలేరు. ఎవరో ఒక మహిళా స్నేహితురాలు - నాగమణిగారో లేక తన సొంత చెల్లెలో తోడు ఉండాలి.

1973 ప్రాంతంలో నేను రైలులో రాజమండ్రి పెళ్ళికి వెళ్ళవలసి వచ్చింది.మదరాసు సెంట్రల్ ష్టేషనులో కలకత్తా మెయిలు ఫస్టుక్లాసు కంపార్టుమెంటులో సూటుకేసు పెట్టి ప్లాట్‌ఫారం మీద పచార్లు చేస్తున్నాను.సుబ్బారావు(భానుమతిగారి అసిస్టెంటు) నన్ను చూసి,వెనక్కి పరిగెత్తుకెళ్ళి భానుమతిగారికి చెప్పాడు. తిరిగి నా దగ్గరకు వచ్చి అమ్మగారు రమ్మంటున్నారు అన్నాడు. ఆమెగారున్న కంపార్టుమెంటుకు వెళ్ళాను. కింద రెండు పైన రెండు బెర్తులు . భానుమతిగారు,నాగమణిగారు,సుబ్బారావు - మూడు బెర్తులు. నాలుగో బెర్తులో ఎవరో మరొక ప్రయాణికుడు.

భానుమతిగారు ఆ ప్రయాణికుడితో ఇంగ్లీషులో ఏమండీ (నన్ను చూపి) వీరికి పక్క కంపార్టుమెంటులో బెర్తు ఉంది.మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఆ కంపార్టుమెంటులోకి షిఫ్ట్ అయితే వారు ఈ కంపార్టుమెంటులోకి వస్తారు.అందరం స్నేహితులం కలిసి ప్రయాణం చేస్తాం అన్నారు బతిమాలుతున్నట్లు. ఆ ప్రయాణికుడు నాకేమి అభ్యంతరం లేదు అని పైనుంచి కిందకి దిగి బెడ్డు చుట్టుకొన్నాడు.

తర్వాత భానుమతిగారు అటూ ఇటూ చూసి నరసరాజుగారు నేను విశాఖపట్నం వెళుతున్నను.మూడు బెర్తులు రిజర్వు చేయించాను.నాలుగో బెర్తులో మీరు చూసారుగా వాణ్ణి మీ కంపార్టుమెంటులోకి వెళ్ళాడు. వాడి ముఖం చూస్తే ఎందుకో నాకు భయం వేసిందండి. నా ఒంటి నిండా నగలు ఉన్నాయి. అర్ధరాత్రివేళ పై బెర్తునుండు దూకి నా గొంతు పిసుకుతాడేమొనని భయం వేసిందండి. నాగమణి ఆడది-సుబ్బారావు అర్భకుడు-ఏం చెయ్యగలం. మీరు రాజమండ్రి దాక వస్తున్నారు కదా. అప్పటికి తెల్లవారిపోతుంది.భయం లేదు.ఇప్పుడు హాయిగా నిర్భయంగా నిద్రపోవచ్చు అని నిటూర్చారు. అంత ధైర్యశాలి ఆమె.

ఇక విమాన ప్రాయాణం అంటే చెప్పనే అక్కరలేదు. రైలు ప్రమాదం జరిగితే కనీసం శరీరం ఐనా దక్కుతుందండి.విమానం కూలితే ఏముంది.ఎముకలు,చెర్మము తప్ప ఎముంటుంది అంటుండేవారు.

ఒకసారి ఆమె అమెరికా వెళ్ళవలసి వచ్చింది.కుమారుడు భరణి కుటుంబం అమెరికాలో వుంటుంది కదా.ఆ ప్రయాణానికి మూడు నెలల ముందునుంచి సన్నాహం.ట్రావల్ ఏజంటుతో చెప్పిందామె.విమానంలో నేను అంత దూరం ఒంటరిగా ప్రయాణం చెయ్యలేను.నాకు తోడు కావాలి.తెలుగువాళ్ళుగానీ,తమిళులు గాని ఒక కుటుంబం అమెరికాకు ప్రయాణం చేస్తున్నరోజున ఆ విమానంలో వాళ్ళ సీట్ల పక్కన నా సీటు ఉండేట్లు ఎర్పాటుచేస్తే నేను అమెరికా వెళ్తాను.

పాపం ఆ ట్రావల్ ఏజంటు ఎంతో శ్రద్ధ తీసుకొని నెల రోజుల తరవాత ఆమెకు టికెట్లు బుక్ చేసాడు.

బయల్దేరే ముందురోజు సాయంత్రం ఆమెగారి ఇంటికెళ్ళి ఒక అరగంట కబుర్లు చెప్పుకొని Bon Voyage చెప్పి ఇంటికి వెళ్ళాను.

మర్నాడు పొద్దున్నే 7 గంటలకు ఫోన్.ఎవరు? భానుమతిగారు మదరాసులో ఇంటిదగ్గరనుంచే. సామాన్లు కూడా కార్లో పెట్టాకా చివరి నిమషంలో వెళ్ళబుద్ధికాక ఆగిపోయానన్నారు.

ఈ సంఘటన పురస్కరించుకొనే ఆమె పేరు మార్చి అనసూయమ్మగారి అమెరికా ప్రయాణం అని ఈనాడులో నా ' అక్షింతలు ' కాలంలో రాశాను.ఆమెకు చదివి వినిపించాను కూడా. ఆమె పకపకా నవ్వేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి